
D Spiritual: May 6: హిందూ ధర్మంలో మహాభారతం ను పంచమ వేదంగా భావిస్తారు. “వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి” అనే నానుడి మన సంస్కృతిలో ఈ మహాగ్రంథానికి ఉన్న గొప్ప స్థానం తెలియజేస్తుంది. మహాభారతం కేవలం ఇతిహాసం మాత్రమే కాదు, జీవన విధానానికి మార్గదర్శకంగా నిలిచిన గ్రంథం కూడా. ఈ ఇతిహాసంలో ప్రత్యేక గుర్తింపు పొందిన స్త్రీమూర్తి ద్రౌపది. రామాయణం లో సీత ఎంత పతివ్రతగా ప్రసిద్ధి చెందిందో, మహాభారతంలో ద్రౌపది అంతే ధైర్యం, గౌరవం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఆమెకు అంకితమైన ఆలయాలు భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.
పురాణాల ప్రకారం ద్రౌపది అగ్నికుండం నుంచి అవతరించిన “అయోనిజ” — అంటే గర్భం ద్వారా జన్మించని దివ్య స్త్రీ. ఆమెను యజ్ఞం ద్వారా పుట్టినందుకు “యాజ్ఞసేని” అని కూడా పిలుస్తారు. మహాభారతం ప్రకారం పాండవుల శక్తిని ఏకం చేసి నడిపించిన ఆధ్యాత్మిక శక్తిగా ఆమెను భావిస్తారు. ఆమెకు “కృష్ణ” అనే పేరు కూడా ఉంది. మహాభారతంలో ముగ్గురు కృష్ణులు ముఖ్య పాత్ర పోషించారని చెబుతారు — శ్రీకృష్ణుడు, ద్రౌపది, అలాగే వ్యాస మహర్షి.
దక్షిణ భారతదేశంలో ద్రౌపదిని “ద్రౌపది అమ్మన్”గా గ్రామదేవతగా పూజించే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ ఆరాధన విస్తృతంగా కనిపిస్తుంది. విదేశాల్లో కూడా ఆమెకు ఆలయాలు ఉండటం భారతీయ సంస్కృతి విస్తృతిని తెలియజేస్తుంది.
విదేశాల్లో సింగపూర్, మలేషియా, శ్రీలంక, మారిషస్ వంటి దేశాల్లో ద్రౌపది అమ్మన్ ఆలయాలు ఉన్నాయి. అక్కడి భారతీయ వంశీయులు ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారు.
భారతదేశంలో ముఖ్య ద్రౌపది ఆలయాలలో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు ములాపేటలో ఉన్న ద్రౌపది ఆలయం ప్రసిద్ధి పొందింది. కర్ణాటక లోని ధర్మరాయ స్వామి ఆలయం సుమారు 800 సంవత్సరాల పురాతనమైనది; ఇక్కడ పాండవులతో పాటు ద్రౌపది పూజలు అందుకుంటుంది.
తమిళనాడు లో ద్రౌపది అమ్మన్ ఆలయాలు విస్తృతంగా ఉన్నాయి. ముఖ్యంగా ద్రౌపది అమ్మన్ టెంపుల్ వేలచెరి, ద్రౌపది అమ్మన్ టెంపుల్ ఆలందూరు, ద్రౌపది అమ్మన్ టెంపుల్ సైదాపేట్, ద్రౌపది రథం మహాబలిపురం, ద్రౌపది అమ్మన్ టెంపుల్ కుంభకోణం ప్రసిద్ధి పొందాయి.
ఈ ఆలయాలలో ద్రౌపది అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావించి పూజిస్తారు. ప్రత్యేకంగా తమిళనాడులో జరిగే “తిమితి” (అగ్నిప్రవేశం) ఉత్సవం ద్రౌపది భక్తిలో కీలకమైనది. భక్తుల విశ్వాసం ప్రకారం, జీవితంలో కనీసం ఒక్కసారి అయినా ఈ ఆలయాలను దర్శిస్తే శుభఫలితాలు లభిస్తాయని నమ్మకం.
