
D Spiritual: May 4: మనీ ప్లాంట్ ఇంటికి అదృష్టం, సానుకూల శక్తిని తీసుకొస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇది మానసిక ప్రశాంతతను అందించి ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మొక్కను సరైన దిశలో ఉంచకపోతే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు. అందుకే మనీ ప్లాంట్ ఎక్కడ ఉంచాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవడం అవసరం.
ఇళ్లలో ఆకర్షణీయంగా కనిపించే మొక్కలను పెంచే వారిలో మనీ ప్లాంట్ ఒక ముఖ్యమైనది. ఈ మొక్క సులభంగా పెరుగుతుంది మరియు ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం ఉంది. దీని వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుందని, అప్పుల బాధలు తగ్గి ఆర్థిక సమస్యలు దూరమవుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే ఈ మొక్కను తప్పు దిశలో ఉంచితే ప్రతికూల ఫలితాలు రావచ్చని చెబుతున్నారు. ఇంటిలో ఈశాన్య దిక్కులో మనీ ప్లాంట్ ఉంచితే రావలసిన డబ్బు ఆగిపోవడమే కాకుండా, ఉన్న ధనం కూడా తగ్గే అవకాశం ఉందని విశ్వాసం. అలాగే పడమర దిశలో పెంచితే భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.
మరి ఏ దిశలో ఉంచితే మంచిదనే ప్రశ్నకు వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తరం, దక్షిణ దిక్కులు అనుకూలంగా భావిస్తారు. ముఖ్యంగా ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ ఉంచితే అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయని చెబుతారు. ఆగ్నేయం వినాయకునికి ఇష్టమైన దిశగా భావించబడుతుంది. అందువల్ల ఆ దిశలో మొక్కను పెంచితే గణపతి ఆశీస్సులు లభించి ఇంట్లో ధనప్రాప్తి పెరుగుతుందని నమ్మకం ఉంది.
మనీ ప్లాంట్ సంరక్షణలో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ఈ మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. నేలపై కాకుండా పైకి ఎగబాకేలా పెంచడం వృద్ధిని సూచిస్తుంది. పసుపు రంగు లేదా ఎండిపోయిన ఆకులను వెంటనే తొలగించాలి, ఎందుకంటే అవి ప్రతికూలతను సూచిస్తాయని చెబుతారు. అలాగే పెంపుడు జంతువులు ఈ మొక్క ఆకులను తినకుండా జాగ్రత్త పడాలి. ఈ విధంగా సంరక్షిస్తే ఇంట్లో అదృష్టం, ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుందని విశ్వాసం ఉంది.
