
D Spiritual: Sep 22:హిందూ మతంలో నవరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ఏటా జరిగే నాలుగు నవరాత్రులలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అత్యంత పవిత్రమైనవిగా, ఫలవంతమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ సమయంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు.
ఈ ఏడాది దేవీ నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22, సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.
మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా, మరికొన్ని చోట్ల శైలపుత్రి దేవిగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు దుర్గమ్మ శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది.
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
మొదటి రోజు దుర్గాదేవిని బాల త్రిపుర సుందరి, శైల పుత్రిక రూపాల్లో పూజిస్తున్నారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, కనక దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై కూడా నేటి నుండి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గమ్మ బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు.
బాల త్రిపుర సుందరి అంటే ఏమిటి?
శారదా నవరాత్రుల్లో అమ్మవారిని నవ దుర్గలుగా రెండు సాంప్రదాయాల ప్రకారం పూజిస్తారు. మొదటి సాంప్రదాయం పురాణోక్తం. ఈ సంప్రదాయం ప్రకారం మొదటి రోజున అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా భావించి పూజిస్తారు. త్రిపురుని భార్య త్రిపుర సుందరి దేవి. త్రిపురుడు అంటే ఈశ్వరుడు, కాబట్టి ఆయన భార్య గౌరి దేవి అని అర్థం.
త్రిపుర సుందరి తత్త్వం:
త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు — జాగృతి, స్వప్న, సుషుప్తి. అలాగే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ బాల త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మవారిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగి, నిత్య సంతోషం కలుగుతుందని నమ్మకం. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు బాల త్రిపుర సుందరి అధిష్ఠాన దేవత. కనుక ఉపాసకులు అమ్మవారి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు.
బాల త్రిపుర సుందరిని పూజించడం ప్రాముఖ్యత:
- సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా భక్తులు త్రిపుర సుందరిని పూజిస్తారు.
- పూజ చేయడం ద్వారా జీవితంలో స్థిరత్వం, విజయాన్ని పొందుతారు.
- పితృదోషం, చంద్రునికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
- భక్తుల మనస్సులో విశ్వాసం, ధైర్యం నింపబడతాయి.
- అమ్మవారి ఆశీస్సులతో కుటుంబంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు నిలుస్తాయి.
ప్రత్యేక ఆచారం:
ఈ రోజు రెండు నుంచి పది సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. వారికి కొత్త బట్టలు పెట్టి, అమ్మవారికి పాయసం నైవేద్యం చేస్తారు.
