
DNews: Mar 14: అసోంలో సిల్చర్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ.23,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముఖ్యంగా సిల్చర్-షిల్లాంగ్ మధ్య నిర్మించబోయే యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేకు రూ.22,864 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. ప్రజాసభలో మాట్లాడుతూ మోదీ, మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ ప్రభావం భారతదేశంపై తక్కువగా ఉండేలా కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహిత ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. అసోంలో కాంగ్రెస్ ప్రజలను హింస, ఉగ్రవాదం వైపు దారి మళ్లించిందని, కానీ నేడు రాష్ట్రంలో యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
మోదీ మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితి నెలకొంది. ప్రజల భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాలి. కానీ అది దేశ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైంది. మోదీని దూషించడం, దేశంలో భయాందోళనలు సృష్టించడం మాత్రమే కాంగ్రెస్ పని. కొన్ని శక్తులు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందకూడదని కోరుకుంటున్నాయి. కాంగ్రెస్ అలాంటి శక్తుల బొమ్మగా మారింది” అని అన్నారు.
అసోం, దేశానికి కాంగ్రెస్కు ఎలాంటి దూరదృష్టి లేదని మోదీ ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించడం, అబద్ధాలు, వదంతులు వ్యాప్తి చేయడమే వారి పని అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం యువతకు ఎన్నో అవకాశాలు కల్పించిందని, కాంగ్రెస్ ఆలోచనలు ఆగిన చోట బీజేపీ పనులు మొదలవుతాయని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు అభివృద్ధిలో ప్రాధాన్యం ఇవ్వడమే బీజేపీ ప్రధాన మంత్రం అని మోదీ స్పష్టం చేశారు.
