
DNews: Feb28: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో ఉన్న ఒక బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు (సామర్లకోట బ్లాస్ట్ న్యూస్) సంభవించింది. మండలంలోని వెట్లపాలెం ప్రాంతంలోని గోదావరి కాలువ పక్కన ఉన్న సూర్యశ్రీ బాణసంచా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది 2 అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలేనని సమాచారం. బాణసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పరిమితికి మించి బాణసంచా తయారీ కారణంగా ఈ సంఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. శరీర భాగాలు సంఘటన స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి.
ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పేలుడు సంఘటన గురించి ఆరా తీశారు. అధికారులు అక్కడి పరిస్థితిని ఆయనకు వివరించారు. తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితకు సూచించారు. ఈ మేరకు హోంమంత్రి అనిత సంఘటనా స్థలానికి బయలుదేరారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
