
DNews: Feb 18: వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో జరిగిన ఘోర సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ బాటిల్, రెండు కత్తులు తీసుకుని సునీత ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో సునీత తల్లి పైకప్పుపై బట్టలు ఆరబెట్టడానికి వెళ్లడంతో సునీత ఒంటరిగా ఇంట్లో ఉంది. మహేష్ ఇంట్లో పెట్రోల్ పోసి, ఇంటిని కాల్చేస్తానని బెదిరించాడు. భయంతో సునీత కేకలు వేస్తుండగా, అతడు తీసుకువచ్చిన కత్తితో ఆమెను పలు సార్లు పొడిచి అక్కడికక్కడే చంపేశాడు. అనంతరం మహేష్ బాత్రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. సునీత కేకలు విని పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాత్రూమ్ తలుపు పగులగొట్టి మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మహేష్, సునీత తన మొదటి భార్య అని, తనకు తెలియకుండా ఆమె రెండోసారి పెళ్లి చేసుకుందని, అందుకే హత్య చేశానని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
