
DNews: Feb 7: హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగి, ముఖ్యమైన పత్రాలు దగ్ధమైనట్లు సమాచారం. ఈ ఘటనపై సెంట్రల్ జోన్ డీసీపీ కే. శిల్పవల్లి వివరాలు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఆమె తెలిపారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన ఫైళ్లు, సాక్ష్యాధారాలు ఈ ల్యాబ్లోనే నిర్వహించబడతాయని, కీలక ఫైళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదని చెప్పారు. మొదటి అంతస్తులో కంప్యూటర్లు కూడా ఉన్నాయని తెలిపారు.
డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ, ఐదు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చామని చెప్పారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఆఫీస్ బాయ్ మంటలను గమనించి వెంటనే సమాచారం ఇచ్చాడని, ఆ సమయంలో మంటలను ఆర్పే ప్రయత్నంలో అస్వస్థతకు గురై 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారని వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు ఉద్యోగులు లోపల ఉన్నారని, వారు సురక్షితంగా బయటకు వచ్చారని తెలిపారు.
డీఎఫ్ఓ శ్రీదాస్ మాట్లాడుతూ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లోని సీజ్డ్ ప్రాపర్టీ సెక్షన్లో మంటలు చెలరేగాయని, విలువైన హార్డ్డిస్కులు, పత్రాలు దగ్ధమయ్యాయని చెప్పారు. ఉదయం 10:22 గంటలకు సమాచారం అందగానే అక్కడికి చేరుకున్నామని, అప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించాయని తెలిపారు. రెండో అంతస్తులో కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉన్నప్పటికీ మంటలు అక్కడికి వ్యాపించలేదని చెప్పారు. మొదటి అంతస్తులోని సున్నితమైన ప్లాస్టిక్ వస్తువులు దగ్ధమయ్యాయని, హార్డ్డిస్కులు పూర్తిగా దగ్ధమయ్యాయా లేదా అన్నది పరిశీలించాల్సి ఉందని వివరించారు.
ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా, విలువైన సాక్ష్యాధారాలు, పత్రాలు దగ్ధమవడం విచారకరంగా మారింది.
