
DNews: Jan 29: హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ప్రదర్శన “వింగ్స్ ఇండియా–2026” ఘనంగా ప్రారంభమైంది. ఈ నాలుగు రోజుల ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు బుధవారం ఉదయం ప్రారంభించారు. ఫిక్కీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. 30కిపైగా హెలికాప్టర్లు, విమానాలు, ఎయిర్క్రాఫ్ట్లు వివిధ దేశాల ఎయిర్లైన్స్ ప్రదర్శనలో భాగంగా ప్రదర్శించాయి. మొదటి రోజున మార్క్ జెఫ్రీస్ టీమ్, సూర్యకిరణ్ టీమ్లు చేసిన వైమానిక కసరత్తులు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ ప్రదర్శనలో కొత్త ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోయింగ్కు చెందిన విస్క్ సంస్థ రూపొందిస్తున్న డ్రైవర్లెస్ ఎయిర్ టాక్సీ నమూనా అందరి దృష్టిని ఆకర్షించింది. నాలుగు ప్రయాణికులను తీసుకెళ్లగల ఈ ఎయిర్ టాక్సీ విద్యుత్ ఆధారంగా నడుస్తుంది. పూర్తిగా ఆటోమేటిక్గా నడిచేలా రూపొందించిన ఈ నమూనా ప్రస్తుతం పరీక్ష దశలో ఉందని, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పట్టణ రవాణా రంగాన్ని పూర్తిగా మార్చివేసే శక్తి దీనికి ఉందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఎదిగిందని, గత దశాబ్దంలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. విమాన తయారీ, పైలట్ శిక్షణ, అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ, ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ వంటి రంగాల్లో భారత్లో అపార అవకాశాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ ఎయిర్లైన్స్ ఇప్పటికే 1500కిపైగా విమానాలను ఆర్డర్ చేశాయని తెలిపారు.
అలాగే, 2014లో దేశంలో 70 ఎయిర్పోర్టులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 160కి పైగా పెరిగిందని, టియర్–2, టియర్–3 నగరాలను కూడా విమానాశ్రయాలతో అనుసంధానం చేసి ప్రతి పౌరుడికి విమాన ప్రయాణాన్ని సులభతరం చేశామని మోదీ పేర్కొన్నారు. భారత్ను గ్లోబల్ ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

