
D Spiritual: Dec 31: కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందనే భక్తుల నమ్మకంతో, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తిరుమలలో తొలిమూడు రోజుల పాటు ఈ-డిప్ ద్వార టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందని టీటీడీ అధికారులు ముందుగానే ప్రకటించారు. అయినప్పటికీ, సాధారణ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు.
టోకెన్ లేని భక్తుల కోసం జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ క్యూలైన్లలో దర్శనానికి సహకరించాలని సూచించారు.
భద్రతా పరంగా దాదాపు 3,500 మంది పోలీసు, విజిలెన్స్ సిబ్బందిని మోహరించారు. ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ, పగడ్బందీ భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తున్నారు.
టోకెన్ కలిగిన భక్తులు నిర్దేశిత టైమ్ స్లాట్ ప్రకారం దర్శన క్యూలైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. నిన్న ఒక్కరోజులోనే 59,631 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 18,609 మంది తలనీలాలు సమర్పించారు.
భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.36 కోట్లకు చేరిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
