
D Spiritual: Dec 19: శ్రీకనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసం చివరి గురువారం సందర్భంగా లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉచిత అన్నప్రసాదం, సహస్రఘటాభిషేకం వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.
విశాఖ నగరంలోని బురుజుపేటలో వెలసిన శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి మార్గశిర మాసం ఆఖరి గురువారం నాడు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచే పూర్ణామార్కెట్ ప్రాంతం నుంచి ఆలయం వరకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. కనీవిని ఎరుగని రీతిలో భక్తుల రద్దీ నెలకొంది.
ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీసులు సమన్వయంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. క్యూలైన్లలో నిలిచిన భక్తులకు మంచినీరు, మజ్జిగ, ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.
మధ్యాహ్నం సుమారు 20 వేల మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం ఏర్పాటు చేసి, రుచికరమైన ఆహార పదార్థాలను వడ్డించారు. భక్తులు ఈ సేవలను సంతృప్తిగా స్వీకరించారు.
సాయంత్రం అమ్మవారి సన్నిధిలో సహస్రఘటాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారు 2 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమై సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన సహస్రఘటాభిషేకం 4.45 గంటలకు ప్రారంభమైంది.
సాయంత్రం 6 గంటలకు పూజాధికాలు ముగించాక మళ్లీ భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. రాత్రి వరకు నిరంతరాయంగా దర్శనాలు కొనసాగాయి.
పసుపు, కుంకుమ నీళ్లతో నింపిన కలశాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ జలాలతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని శాంతింపజేసే విధంగా వివిధ రకాల షోడశోపచార పూజలను నిర్వహించారు.
మార్గశిర మాసంలో శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా మార్గశిర మాసం మొత్తం లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు.
ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడంలో ఆలయ ఈవో శోభారాణి, సహాయ కార్యనిర్వహణాధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరమణ, ఉత్సవ కమిటీ సభ్యులు కందుల నాగరాజు ముఖ్య పాత్ర పోషించారు. అలాగే పోలీసులు సమన్వయంతో కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారు. ఆలయ పీఆర్వో ప్రసాద్, పర్యవేక్షకులు ముద్దాడ వెంకటరమణ, సింహాచలం దేవస్థానం అధికారులు, జగన్నాథస్వామి ఆలయ సిబ్బంది తదితరులు విశేష సేవలందించారు.
