
DNews: Dec19: తెలుగు రాష్ట్రాల మహిళా న్యాయవాదులకు సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. తెలంగాణ, ఏపీ బార్ కౌన్సిల్లలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రిజర్వేషన్ అంశాన్ని ఎన్నికల నోటిఫికేషన్లోనే స్పష్టంగా చేర్చాలని కోర్టు ఆదేశించింది.
దేశవ్యాప్తంగా ఉన్న బార్ కౌన్సిల్లలో మహిళలకు 1/3 వంతు ప్రాతినిధ్యం కోరుతూ న్యాయవాది యోగ్మయ మరియు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 8న కోర్టు తన తీర్పును ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాని చోట 30 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాలని సూచించింది. ఏపీ, తెలంగాణలలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా నోటిఫికేషన్ జారీ కాలేదని, అందువల్ల ఇక్కడ కూడా మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయాలని సునీత, సుభాని గుడిమల్ల తదితరులు మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వారి పిటిషన్లను విచారించి పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది.
