
DNews: Dec 08: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల కూకట్పల్లి పర్యటనలో పాల్గొని అక్కడి ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారు. సోమవారం ఆమె వై జంక్షన్ వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, మెడ్చల్ జిల్లా పర్యటనలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలో తన పర్యటన కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వం ఇక్కడ రూ.2,000 కోట్ల విలువైన భూములను అమ్మేసినా, కూకట్పల్లి అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆమె విమర్శించారు. గ్లోబల్ రైజింగ్ సమ్మిట్పై పెద్ద హంగామా చేస్తున్నా, కూకట్పల్లిలో ప్రాథమిక సౌకర్యాలు లేవని, ఒక్క స్టేడియం కూడా లేదని ప్రశ్నించారు. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద భారీ ట్రాఫిక్ సమస్య ఉందని, కూకట్పల్లి మినీ ఇండియా లాంటిదని, కానీ ఇక్కడ పేద ప్రజలు ఇళ్ల అద్దెకు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లు అడగడానికి వస్తారని, మిగతా సమయంలో ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలక పార్టీ దృష్టి పెట్టడం లేదని, ప్రతిపక్షం ప్రశ్నించడం లేదని, అందుకే జాగృతి బాధ్యత తీసుకుని ప్రశ్నిస్తోందని కవిత అన్నారు. .
