
D Spiritual: Dec 6: చాలా మంది నిద్రలేచిన వెంటనే తమ అరచేతులను లేదా దేవుళ్ల ఫోటోలను చూస్తారు. జ్యోతిష్య పండితుల ప్రకారం వేకువజామునే మూడు ముఖ్య విషయాలను చూస్తే ఆ రోజంతా శుభాలు జరుగుతాయి. ఉదయం లేచినప్పుడు చాలామంది తమకు ఇష్టమైన దేవుళ్లను, పసిపిల్లల ముఖాలను లేదా అద్దంలో తమను చూసుకుంటారు. మరికొందరు అరచేతులను చూసి దేవునికి నమస్కరిస్తారు. అయితే పండితులు సూచించే మూడు నియమాలు పాటిస్తే శుభఫలితాలు లభిస్తాయని చెబుతారు.
మొదటి నియమం సూర్యోదయానికి ముందే మేల్కొనడం. చిన్నపిల్లలకు తప్ప మిగతా వారందరూ సూర్యుడు ఉదయించే 90 నిమిషాల ముందు లేవాలి. దీనిని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూలశక్తి విరబూస్తుంది. అందువల్ల బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల ఆలోచనల్లో సానుకూలత, శ్రమ, విజయం, ఆరోగ్యం పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
రెండవ నియమం నిద్రలేవగానే అరచేతులను చూసి నమస్కరించడం. “కరాగ్రే వసతే లక్ష్మీ…” అని చెప్పే శ్లోకం ప్రకారం చేతి చివరలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, చేయిమూలంలో గౌరీదేవి వాసం చేస్తారని భావిస్తారు. చేతులను చూసి నమస్కరించడం ద్వారా ఈ మూడు దేవతల కృప లభిస్తుందని నమ్మకం.
మూడవ నియమం భూమిదేవికి నమస్కారం చేయడం. మంచం నుంచి కాళ్లు నేలను తాకే ముందు “సముద్ర వసనే దేవీ…” శ్లోకం చదవాలి. భూమిని సముద్రాన్ని వస్త్రంగా ధరించిన దేవిగా, పర్వతాలను తన స్థనాల్లా కలిగిన తల్లిగా స్తుతించి, ఆమెపై అడుగు పెట్టాల్సి వస్తున్నందుకు క్షమించమని కోరాలి. ఇది కృతజ్ఞతా భావాన్ని పెంచే శుభకార్యం అని పండితులు చెబుతున్నారు.
