
రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ‘సృజనాత్మక నగరం’గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధానిలో నిర్మించే ప్రతి భవనం ప్రత్యేకంగా, ఒక ఐకాన్ గ విలక్షణంగా, పచ్చదనంతో అలంకరించబడాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 55వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన అనేక కీలక ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది. రాజధాని భవనాల డిజైన్ల కోసం గతంలో విస్తృత అధ్యయనం జరిగిందని సీఎం గుర్తు చేశారు.
కీలక నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్
అమరావతిలోని ప్రభుత్వ సముదాయంలో గవర్నర్ నివాస సముదాయం ‘లోక్ భవన్’ నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ భవనాన్ని రూ. 169 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. అదేవిధంగా, రూ. 165 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ప్రతిపాదన కూడా ఆమోదం పొందింది. వీటితో పాటు, 2024-25 సంవత్సరానికి వార్షిక గణాంక నివేదికలను కూడా అథారిటీ ఆమోదించింది. రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నాబార్డ్ నుంచి రూ.7,380 కోట్ల భారీ రుణం తీసుకోవడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని సీఆర్డీఏ అథారిటీ అంగీకరించింది. ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారి-16తో అనుసంధానించే పనులకు రూ.532 కోట్ల విలువైన టెండర్లను ఆహ్వానించడానికి కూడా అనుమతి ఇచ్చింది.
