
DNews: Dec 05: హైదరాబాద్: రాష్ట్రాన్ని ‘క్వాంటమ్ సిటీ’గా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ మరియు పరిశ్రమల మంత్రి దూడిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. దేశంలో తొలిసారిగా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో రూపొందించిన ‘లాంగ్ టర్మ్ క్వాంటమ్ స్ట్రాటజీ’ ద్వారా తెలంగాణను క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గురువారం గచ్చిబౌలిలోని ఐఐఐటీ-హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ‘నీతిఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటమ్, తెలంగాణ క్వాంటమ్ స్ట్రాటజీ’ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చినట్లే, రాబోయే రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీ కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని అన్నారు. కృత్రిమ మేధస్సు (AI), క్వాంటమ్ టెక్నాలజీ వంటి రంగాల్లో తెలంగాణను ముందంజలో నిలపడానికి స్పష్టమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. ‘లాంగ్ టర్మ్ క్వాంటమ్ స్ట్రాటజీ’లో భాగంగా పరిశోధన మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ వేగవంతం, ప్రతిభావంతుల పెంపకం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. క్వాంటమ్ సెన్సింగ్, సెక్యూరిటీ, కమ్యూనికేషన్, కంప్యూటింగ్ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి (R&D) మరియు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే ఈ విధానం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధానం మాత్రమే కాకుండా, దేశానికి క్వాంటమ్ టెక్నాలజీ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీలో దేశానికి ప్రమాణంగా నిలిచేలా ప్రత్యేక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ప్రారంభించామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్టప్లు, కొత్త ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
