
DNews: Dec 05: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ బీసీల రాజకీయ హక్కులు, సంక్షేమం కోసం అసెంబ్లీలో బీసీల గొంతు వినిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. స్థానిక సంస్థలు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు సింహభాగం టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ అగ్రనేతలను కోరతానని ఆయన స్పష్టం చేశారు. గురువారం సమ్రాట్ భవన్లో జరిగిన సమావేశంలో నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్, బీసీ జేఏసీ మరియు జాతీయ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఆయన ఐక్యత ప్రకటించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీల రాజకీయ విప్లవం, బీసీ నినాదం రాష్ట్రంలో మరింత బలపడిందని అన్నారు. బీసీలకు సీట్లు కేటాయిస్తే వారు ఘన విజయం సాధిస్తారని, తన విజయం బీసీ సంఘాల కృషి ఫలితమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన అవకాశంతో ఇది సాధ్యమైందని తెలిపారు. బీసీలు ఐక్యంగా రాష్ట్ర అధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత విషయంలో మోసం చేసిన బీజేపీకి బీసీలు బుద్ధి చెప్పాలని అన్నారు. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు విజయశీలులు, రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ విప్లవంతో మరిన్ని స్థానాలు గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. బీసీలు ఈ స్పూర్తితో రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, బీసీ జేఏసీ జాతీయ వర్కింగ్ చైర్మన్ గుజ్జా కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల విజయానికి కృషి చేస్తామని, బీసీలను ఐక్యపరచి రాజకీయంగా ఎదగాలని తెలిపారు. నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో సత్కరించారు. బీసీ జేఏసీ రాష్ట్ర సహ-కన్వీనర్లు కులకచర్ల శ్రీనివాస్, విక్రంగౌడ్, బీసీ అసోసియేషన్ రాష్ట్ర ఇన్చార్జ్ మనిమంజరి, బీసీ కుల సంఘాల అధ్యక్షులు శేఖర్, వీరస్వామి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
