
DNews: Nov 26: వేములవాడ పట్టణంలో మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్చార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమన్న ఆలయంలో స్వామివారికి అన్నదానం జరుగుతున్న సమయంలో వారు సుమారు అరగంట పాటు వేచి ఉండి, అనంతరం భీమన్న స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వేదపండితులు వారికి ఆశీర్వచనాలు అందించగా, ఆలయ ఈఓ రామదేవి శేషవస్త్రం కప్పి ప్రసాదం అందజేశారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్ భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. కొడెల, ఉచిత దర్శనం, అభిషేకం క్యూ లైన్లు, కల్యాణకట్ట వంటి ప్రాంతాలను పరిశీలించి, వేడి నీరు వంటి సౌకర్యాలపై విచారణ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాధాబాయి, ఆలయ ఈఓ రామదేవి, డీఈ రఘునందన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, కట్కూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
