
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశమంతా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుండగా.. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నాయకులను పవన్ కల్యాణ్ స్మరించుకున్నారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం సాధించిన అభివృద్ధి, రక్షణ రంగంలో పెరిగిన సామర్థ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ సాధిస్తున్న ప్రాధాన్యత వంటి అంశాలను ప్రస్తావించారు. రాజకీయ, సామాజిక భేదాలను పక్కనపెట్టి.. ముఖ్యంగా యువత వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పవన్ కల్యాణ్ కోరారు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా స్పందించారు. భారతీయులందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో భాగమైనందుకు గర్వంగా ఉందని పేర్కొంటూ.. ‘జై హింద్’ అంటూ తన సందేశాన్ని ముగించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ తన సందేశాన్ని పంచుకున్నారు.
అదే విధంగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ దేశంపై తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా దేశాన్ని గౌరవిస్తూనే ఉంటాననే భావాన్ని వ్యక్తం చేస్తూ.. భారతీయులందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. సినీ తారల ఈ సందేశాలు అభిమానులను, ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
