
D News: Sept 7: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నియామక ప్రక్రియను చేపట్టింది.
ఈ పోస్టుల్లో ఇంజినీరింగ్-ఎలక్ట్రికల్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫైర్ సర్వీసెస్, కార్పొరేట్ ప్లానింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విద్యార్హతలు, పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ, బీఈ/బీటెక్, ఎంబీఏ లేదా ఎంసీఏ పూర్తి చేసి, నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా పని అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి విషయానికి వస్తే.. 2026 సెప్టెంబర్ 7 నాటికి మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పోస్టుల వారీగా విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించుకోవాలని సూచించారు.
