
DNews : Dec 01: దుండిగల్: సీసీఎస్ దుండిగల్ పోలీసులు వెండి ఆభరణాల దొంగతన కేసును ఛేదించారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 15 కిలోల వెండి ఆభరణాలు మరియు ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మెడ్చల్ జోన్ అదనపు డీసీపీ పురుషోత్తం సోమవారం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 7న బౌరంపేట్లోని సోమేశ్వర్ జ్యువెలర్స్ నుండి గుర్తు తెలియని వ్యక్తులు 15 కిలోల వెండి ఆభరణాలను దొంగిలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. వారిలో ముగ్గురు — చెతన్, ప్రకాశ్, సిరాజుద్దీన్ — గత నెల 26న రాజస్థాన్లో పట్టుబడగా, కలుకాగ్ గత నెల 19న బహదూర్పల్లిలో అరెస్టయ్యాడు. వీరి వద్ద నుంచి మొత్తం 15 కిలోల వెండి ఆభరణాలు మరియు వాహనం స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు నాథురామ్తో పాటు మహేందర్, జైతరణ్ గోవింద్ పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు శోధన చర్యలు కొనసాగుతున్నాయి.
