
DNews:04 NOV:పెగడపల్లి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకుల్లో నాణ్యత సమస్యలు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఆరవల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన దీనికి తాజా ఉదాహరణగా నిలిచింది.
గ్రామానికి చెందిన గొల్లపల్లి కవిత స్థానిక రేషన్ షాపు నుండి బియ్యం తీసుకువచ్చినప్పుడు అందులో గాజు గ్లాస్ ముక్క ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. గమనించకుండా అన్నం వండుకుని తింటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామస్తులు గాజు ముక్క ఉన్న బియ్యాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్గా మారింది. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం రేషన్ సరుకుల నాణ్యతపై పర్యవేక్షణ బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆరవల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పలంచ లక్ష్మణ్ మాట్లాడుతూ, “ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెబుతున్నా, బియ్యం నాణ్యతగా లేదు. ఎక్కువ శాతం నూకలు, దొడ్డు బియ్యం కలిసిపోతున్నాయి,” అని ఆరోపించారు.
