
DNews:29 OCT:హైదరాబాద్లోని పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన కారు ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదానికి గురైన కారు రోడ్డుకు అడ్డంగా ఆగిపోవడంతో, పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ, వాహనాన్ని తొలగించేందుకు జేసీబీ రాక కోసం ఎదురు చూస్తున్నారు.
సరిగ్గా అదే సమయంలో, దేవరకద్ర నియోజకవర్గం పర్యటనకు వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి కాన్వాయ్ను ఆపి, ట్రాఫిక్ జామ్ను గమనించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పోలీసులు చేయాల్సిన పని తమకెందుకు అని ఆలోచించకుండా, వెంటనే తన సిబ్బందితో కలిసి రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును పక్కకు నెట్టించి ట్రాఫిక్ను క్లియర్ చేయించారు. ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మంత్రి తన పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
మంత్రి శ్రీహరి స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి చేసిన ఈ పనిని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రజా సమస్యల పట్ల మంత్రి చూపిన చొరవను, బాధ్యతాయుతమైన వైఖరిని అభినందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
