
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు భద్రత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ (1+1) కేటాయిస్తూ.. చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత భద్రత కోసం వర్మ చేసిన అభ్యర్థన ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ భద్రత కేటాయింపుకు సంబంధించి తమవద్ద నుంచి ఎలాంటి నివేదిక వెళ్లలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ పరిణామం వర్మ భవిష్యత్ రాజకీయ భూమికపై ఊహాగానాలకు దారితీసింది. ముఖ్యంగా ఆయనకు నామినేటెడ్ లేదా కేబినెట్ హోదా కలిగిన పదవి దక్కే అవకాశం ఉందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో, వర్మ ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం నియోజకవర్గాన్ని టిడిపి–జనసేన–బీజేపీ కూటమి సీట్ల కేటాయింపులో భాగంగా జనసేనకు ఇచ్చారు. ఈ సీటు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి విజయాన్ని సాధించారు. ఆ సమయంలో వర్మ, ఆయన అనుచరులు, స్థానిక టిడిపి కార్యకర్తలు పవన్ విజయానికి పూర్తి సహకారం అందించారు. అప్పటి నుంచి వర్మకు గుర్తింపుగా ఏదైనా రాజకీయ పదవి దక్కుతుందనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల వర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలసి నియోజకవర్గ అంశాలు, ఇతర రాజకీయ విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత వర్మకు భద్రత కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రత్యేకంగా నిలిచింది.
తాజా పరిణామాల దృష్ట్యా, వర్మకు కీలక పదవి దక్కుతుందా, దక్కితే అది కేబినెట్ స్థాయి పదవేనా అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో వేడెక్కుతున్నాయి. అయితే గన్మెన్ల కేటాయింపుతో వర్మకు కేబినెట్ హోదా ర్యాంకు పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
