హిందూ మతంలో విజయదశమి (దసరా) పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులు వస్తున్నాయంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో దుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో జరిగే దసరా వేడుకలు చాలా ప్రసిద్ధి చెందాయి. అయితే ఇటీవల వరదలు సంభవించిన నేపథ్యంలో నవరాత్రులు జరుగుతాయా లేదా దుర్గామాత ఉత్సవాలను ఈసారి చూడగలమా లేదా అనే సందేహాలుండేవి. అయితే ప్రస్తుతం వరదలు, వర్షాలు తగ్గడంతో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీ గురువారం నుంచి ప్రారంభమయ్యే నవరాత్రులు 12వ తేదీ విజయదశమి వేడుకలతో ముగియనున్నాయి. ఈ సమయంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అందరికీ దర్శన భాగ్యం కలిగేలా దేవస్థానం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా దుర్గమ్మను 9 రోజుల పాటు ఏయే రూపాల్లో అలంకరిస్తారు.. ఎలాంటి పూజలు జరుపుతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. తొమ్మిది రోజుల్లో అమ్మవారి అవతారాలు..

03 అక్టోబర్ 2024 : మొదటిరోజు, గురువారం రోజున బాల త్రిపుర సుందరీ04 అక్టోబర్ 2024 : రెండో రోజు, శుక్రవారం రోజున గాయత్రీ దేవి05 అక్టోబర్ 2024 : మూడో రోజు, శనివారం రోజున అన్నపూర్ణా దేవి06 అక్టోబర్ 2024 : నాలుగో రోజు, ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి07 అక్టోబర్ 2024 : ఐదో రోజు, సోమవారం రోజున శ్రీ మహా చండీ దేవి08 అక్టోబర్ 2024 : ఆరో రోజు, మంగళవారం శ్రీ మహాలక్ష్మీ దేవి09 అక్టోబర్ 2024 : ఏడో రోజు, బుధవారం, శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం)10 అక్టోబర్ 2024 : ఎనిమిది రోజు, గురువారం దుర్గా దేవి అలంకారం(దుర్గాష్టమి)11 అక్టోబర్ 2024 : తొమ్మిదో రోజు శుక్రవారం రోజున మహిషాసుర మర్దినీ దేవిరూపాల్లో దర్శనమివ్వనున్నారు. అనంతరం క్రిష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. నవరాత్రులు ముగిసిన వెంటనే 12 అక్టోబర్ 2024 శనివారం రోజున రాజ రాజేశ్వరి దేవి రూపంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
మూలా నక్షత్రం వేళ..
ఈ దసరా ఉత్సవాలలో భాగంగా నవరాత్రుల్లో 9 అక్టోబర్ 2024 బుధవారం రోజున మూలా నక్షత్రం వేళ భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉన్నా.. వర్షం వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లలో తాగునీరు, పాలు, అల్పాహారం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
టికెట్ల కోసం ప్రత్యేక కౌంటర్లు..
ఈసారి దుర్గమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక వెబ్సైట్ రూపొందించనున్నారు. ఇందులో టికెట్లు, దర్శన సమయాలతో పాటు ఇతర వివరాలన్నీ పొందుపరచనున్నారు. అలాగే ఆన్లైన్ టికెట్ లేకుండా వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రిసెప్షన్, టోల్గేట్, హోమ్ టర్నింగ్, పున్నమి ఘాట్, విఎంసి ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, బస్టాండ్, రైల్వేస్టేషన్ దగ్గర కరెంట్ టికెట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అమ్మవారికి పట్టువస్త్రాలు..
మరోవైపు మూలా నక్షత్రం రోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో సుమారు 3,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేక సౌకర్యాలు..
దుర్గమ్మ దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం సీతమ్మవారి పాదాల దగ్గర 500 షవర్స్, పునమ్మి ఘాట్ దగ్గర 100, భవానీ ఘాట్ దగ్గర 100 షవర్లతో పాటు 150 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. అలాగే భక్తుల ఆకలి తీర్చేందుకు పులిహోర, కట్టు పొంగలి, దద్దోజనం, సాంబార్ రైస్ మహామండపం ఎదురుగా గల ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రసాదం కౌంటర్లలో 25 లక్షల వరకు లడ్డూలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
