
DNews:31 OCT:నల్గొండ అర్బన్, వెలుగు: మొంథా తుఫాన్ ప్రభావంతో నల్గొండ జిల్లాలో విస్తృత నష్టం జరిగింది. మొత్తం 334 లొకేషన్లలో 230 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాన్ సమయంలోనే ఆర్అండ్బీ అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.
దెబ్బతిన్న రోడ్లు, కోతకు గురైన రహదారులు, బ్రిడ్జిలు, కాజ్వేలు తాత్కాలిక పునరుద్ధరణకు రూ.7 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.225 కోట్లు అవసరమని అంచనా వేసినట్లు వెల్లడించారు.
అదే విధంగా తుఫాన్ వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని మిల్లులకు వేగంగా తరలించేలా సీఎం రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
