
DNews:25 OCT:తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన మేరకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో, శనివారం (అక్టోబర్ 25) ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మీడియా సమావేశం నిర్వహించి, వివరాలను వెల్లడించారు. ఇంటర్ పరీక్షల తేదీలతో పాటు, ప్రాక్టికల్స్ నిర్వహణలో చేసిన మార్పులను కూడా ఆయన వివరించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు.
ప్రాక్టికల్స్లో మార్పులు: ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంచడం, విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ సారి ప్రాక్టికల్ పరీక్షలను కేవలం గవర్నమెంట్ కాలేజీల్లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రైవేట్ సెక్టార్ కాలేజీలను ప్రాక్టికల్ సెంటర్ల జాబితా నుంచి మినహాయించారు. ఈ మార్పులకు అనుగుణంగా ప్రాక్టికల్స్ షెడ్యూల్ను కూడా సిద్ధం చేశారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ప్రతి సంవత్సరం సుమారు 4.20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతుంటారు, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో హాజరయ్యే అవకాశం ఉంది.
