Dtv: Sep 28: కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఓ యువకుడి క్రైమ్ కహాని వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ కు బానిసై డబ్బుల కోసం అడ్డదారులు తొక్కేందుకు ప్లాన్ వేశాడు. ఇందుకు తన స్నేహితులను మరి కొంతమందిని జోడు కలుపుకున్నాడు. తీరా దొంగతనానికి స్కెచ్ వేసి తొలి ప్రయత్నంలోనే అడ్డంగా బుక్కయ్యారు.

జోగులాంబ గద్వాల్ జిల్లా చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ నారాయణపురం గ్రామ శివారులోని వైవైవై కోల్డ్ స్టోరేజ్ లో డైలీ లేబర్ గా పనిచేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డ ప్రవీణ్ కు… క్రమక్రమంగా ఆ అలవాటు కాస్త వ్యసనంగా మారింది. పనిలో వచ్చిన డబ్బులను సైతం బెట్టింగ్ లు పెట్టి పొగొట్టుకున్నాడు. అక్కడ… ఇక్కడ అప్పులు చేశాడు. ఎక్కడా చేతికి చిల్లిగవ్వ దొరకడం లేదు. దీనికి తోడు రోజువారీ జీతంతో అప్పులు చెల్లించడం కష్టతరంగా మారింది. ఈ క్రమంలో ఏదైనా ఒకటి చేసి ఎలాగైన సరే డబ్బులు సంపాదించాలని ప్రవీణ్ ఆలోచనలో పడ్డాడు. ఈ క్రమంలో తాను పనిచేస్తున్న వైవైవై కోల్డ్ స్టోరేజ్ లో దొంగతనానికి ప్రణాళిక రచించాడు. ప్లాట్ ఫాంపై స్టోరేజ్ కి సిద్ధంగా ఉన్న 101 మిర్చి బస్తాల లాట్ కనిపించడంతో వాటిని దొంగిలించి సొమ్ము చేసుకోవాలని భావించాడు. ఇదే అంశాన్ని తన మిత్రులైన రాజేశ్, నందు, నరేశ్, మంజునాథ, హనుమంతు, రాజు, మహేశ్ కు వివరించాడు. వారు సైతం దీనికి ఒప్పుకున్నారు. దీంతో డీసీఎం వాహనంతో ఈ నెల 19వ తేదిన అర్ధరాత్రి కోల్డ్ స్టోరేజ్ వద్దకు ఎనిమిది మంది నిందితులు చేరుకున్నారు. ప్రహరీ గోడ దూకి ప్లాట్ ఫాంపై ఉన్న మిర్చి బస్తాలలో 72 బస్తాలను డీసీఎం వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యారు.

హైదరాబాద్ లో ధర రాదని…:

చోరీ చేసిన మిర్చి బస్తాలను హైదరాబాద్ లోని మార్కెట్ కు తరలించి విక్రయించాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే నిందితులు హైదరాబాద్ కు వెళ్లాక అక్కడి కంటే ఏపీలోని ఆదోనిలో మిర్చికి ఎక్కువ ధర పలుకుతుందని సమాచారం అందడంతో తిరిగి హైదరాబాద్ నుంచి ఆదోనికి బయలుదేరారు. మరోవైపు ఉదయం కోల్డ్ స్టోరేజ్ వెళ్లిన మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మిర్చి బస్తాల మాయం అవడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి దర్యాప్తును చేపట్టారు మానవపాడు పోలీసులు. అప్పటికే నిందితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఎర్రవల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా నిందితుల డీసీఎం వాహనం కనిపించడంతో అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశారు. వాహనంలో ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. డీజీల్, ఇతర అవసరాల కోసం చోరీ చేసిన మిర్చి బ్యాగుల్లో 17వరకు అక్కడక్కడ అమ్మేశారు. మిగిలిన 55 మిర్చిబ్యాగులను, సుమారు రూ.55,000 నగదు, డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ కు అలావాటు పడి నిందితులంతా అప్పులపాలయ్యారు. వాటిని తీర్చేందుకు ఈజీ మనీ కోసం ఈ చోరీకి పాల్పడ్డట్లు శాంతినగర్ సీఐ టాటా బాబు తెలిపారు.

ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా మారి డబ్బుల కోసం చోరీల బాట ఎంచుకున్న ప్రవీణ్ అండ్ బ్యాచ్ కు తొలి ప్రయత్నంలో ఖాకీలు కంచె వేశారు. మరోమారు ఇలాంటి పనులు చేయకుండా ఉండేందుకు కటకటలా వెనక్కి నెట్టారు.

By CS123

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana