
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి చెందిన ఓ జెర్సీ వేలంలో రికార్డు ధర పలికింది. మాంచెస్టర్ యునైటెడ్ మాజీ మసాజర్ రోడ్ థోర్న్లీ సేకరించిన ప్రముఖ ఫుట్బాల్ ఆటగాళ్ల జెర్సీలను ఓల్డ్ ట్రాఫోర్డ్లో వేలం వేశారు. ఈ సందర్భంగా మెస్సీ జెర్సీ ఏకంగా రూ.56.4 లక్షలు (66,107 అమెరికన్ డాలర్లు) ధర పలికింది.
ఇదే వేలంలో క్రిస్టియానో రొనాల్డోకు చెందిన రియల్ మాడ్రిడ్ జెర్సీ రూ.9.05 లక్షలు (10,601 డాలర్లు) మాత్రమే పలికింది. దీంతో రొనాల్డో జెర్సీతో పోలిస్తే మెస్సీ జెర్సీ దాదాపు ఆరు రెట్లు అధిక ధరకు అమ్ముడై అందరి దృష్టిని ఆకర్షించింది.
మెస్సీ జెర్సీ వెనుక ఆసక్తికర కథ
ఈ జెర్సీకి ఇంతటి విలువ రావడానికి దాని వెనుక ఉన్న ప్రత్యేకమైన కథ కూడా ఒక కారణంగా నిలిచింది. 2012లో బార్సిలోనా జట్టు ఓల్డ్ ట్రాఫోర్డ్కు వచ్చిన సమయంలో రోడ్ థోర్న్లీ తన స్నేహితుడు, బార్సిలోనా డిఫెండర్ గెరార్డ్ పికెను సంప్రదించి మెస్సీ జెర్సీని కోరారు.
మ్యాచ్ ముగిసిన అనంతరం పికె స్వయంగా థోర్న్లీని బార్సిలోనా డ్రెస్సింగ్ రూమ్కు తీసుకెళ్లారు. అక్కడ మెస్సీ తాను మ్యాచ్లో ధరించిన జెర్సీని తీసి, దానిపై సంతకం చేసి థోర్న్లీకి అందించారు.
మెస్సీ స్వయంగా మ్యాచ్లో ధరించిన జెర్సీ కావడం.. అందులోనూ అతడి సంతకం ఉండటంతో ఈ షర్ట్కు వేలంలో భారీ డిమాండ్ ఏర్పడింది. చివరకు రూ.56 లక్షలకు పైగా ధర పలికి అరుదైన సేకరణగా నిలిచింది.
