
దిల్లీ వేదికగా బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్ (BWF World Championships) ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి షట్లర్లు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పోటీపడుతున్నారు. అయితే ఈ టోర్నీలో విజేతలకు నగదు బహుమతి ఉండదు. మరి ప్రైజ్మనీ లేకపోయినా ఈ ఛాంపియన్షిప్కు ఎందుకంత ప్రాధాన్యం ఉందో తెలుసుకుందాం.
పాయింట్లే.. అసలైన కరెన్సీ
పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. నగదు బహుమతి లేకపోయినా ప్రపంచ ర్యాంకింగ్ పాయింట్లు ఆటగాళ్లకు ఎంతో కీలకం.
ప్రపంచ ఛాంపియన్షిప్స్లో స్వర్ణ పతకం సాధించిన షట్లర్కు 14,500 ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్లతో ఆటగాళ్ల ప్రపంచ ర్యాంకింగ్ మెరుగుపడటంతో పాటు సూపర్ 1000, సూపర్ 750 వంటి కీలక టోర్నీల్లో సీడింగ్కు కూడా ప్రయోజనం కలుగుతుంది.
ప్రపంచ ఛాంపియన్గా గుర్తింపు
ఈ టోర్నీలో పతకం సాధించడం ద్వారా ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ‘ప్రపంచ ఛాంపియన్’ అనే హోదా వారి కెరీర్కు ఎంతో విలువను తీసుకొస్తుంది. స్పాన్సర్షిప్స్, బ్రాండ్ విలువ పెరగడంతో పాటు ఆయా దేశాల ప్రభుత్వాలు, క్రీడా సమాఖ్యలు పతక విజేతలకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు, అవార్డులు అందించే అవకాశం ఉంటుంది.
అందుకే ప్రైజ్మనీ లేకపోయినా BWF ప్రపంచ ఛాంపియన్షిప్లో టైటిల్ గెలవడం ప్రతి షట్లర్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విజయం.
