
DNews: Nov26: కోనసీమ కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈరోజు ఆయన కోనసీమ జిల్లాలో పర్యటించి, శంకరగుప్తం డ్రెయిన్ కారణంగా నష్టపోయిన కేశనపల్లి కొబ్బరి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను ఓపికగా విన్నారు. సమస్య మూలాల నుంచి కేంద్రం సహకారం వరకు కృషి చేస్తానని చెప్పారు. కోనసీమ కొబ్బరి రైతుల గొంతుకనవుతానన్నారు.
కేవలం రూ.22 కోట్ల నిధులు ఇవ్వడం ద్వారా తాను తొందరపడలేదని, మూలాల నుంచి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని పవన్ స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమ అంతటా డ్రెయిన్ల సమస్యపై పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని ఆయన అన్నారు. “గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన తప్పులను మేము సరిదిద్దుతున్నాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వాస్తవాలు చెబుతున్నాము. మేము అబద్ధాలు చెబితే యువత మమ్మల్ని నమ్మదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా, శంకరగుప్తం డ్రెయిన్ సమస్యపై అధికారుల తీరును పవన్ కళ్యాణ్ సున్నితంగా విమర్శించారు. డ్రెయిన్ పై జరుగుతున్న ఆక్రమణలను అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. గతంలో నీటిపారుదల నిపుణుడు రోశయ్య కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు పక్కన పెట్టారని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ మద్దతును కూడా తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.
