
D News: Jul 10: రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుడికి కేటాయించిన సీటును ఇవ్వకుండా, ఆ సీటును టికెట్ ఎగ్జామినర్ (TTE) స్వయంగా వినియోగించుకున్న ఘటనలో సదరన్ రైల్వేకు కేరళ వినియోగదారుల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికుడికి కలిగిన మానసిక వేదన, అసౌకర్యానికి పరిహారంగా రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని ఎర్నాకులం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది. అదనంగా కేసు ఖర్చుల కింద రూ.3 వేలు, టికెట్ మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాలని సూచించింది.
ఎర్నాకులం జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు డి.బి. బినూ, సభ్యులు రామచంద్రన్ వి., శ్రీవిద్య టి.ఎన్.లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. తీర్పు ప్రతిని అందుకున్న 45 రోజుల్లోపు పరిహారం చెల్లించాలని రైల్వే శాఖకు ఆదేశించింది. నిర్ణీత గడువులో చెల్లించకపోతే మొత్తం పరిహారంపై ఏడాదికి 6 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఫిర్యాదుదారుడు తన భార్యతో కలిసి అలువ నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ చేసుకున్నాడు. అయితే రైలు అలువ స్టేషన్కు చేరుకున్నప్పుడు తనకు కేటాయించిన సీటును టిటిఈ ఆక్రమించి, తన సూట్కేసును గొలుసుతో కట్టి అక్కడే ఉంచాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీటును ఖాళీ చేయాలని కోరినా, మరో సీటులో కూర్చోవాలని టిటిఈ సూచించాడని, ఇతర ప్రయాణికుల ఎదుట తమను అవమానించారని ఆరోపించాడు. దీంతో సేవల్లో నిర్లక్ష్యం, అన్యాయమైన వ్యవహారం జరిగిందంటూ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు.
ఈ ఆరోపణలను సదరన్ రైల్వే ఖండించింది. ప్రయాణికుడు, అతని భార్యకు వేర్వేరు బేల్లో బెర్తులు కేటాయించామని, ఇద్దరూ కలిసి ప్రయాణించేలా టిటిఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాడని తెలిపింది. ఆ ఏర్పాటుకు ప్రయాణికుడు అంగీకరించిన తర్వాత మళ్లీ అసలు సీటును కోరడం సమంజసం కాదని వాదించింది. విధి నిర్వహణలో భాగంగా ప్రతి స్టేషన్లో త్వరగా దిగేందుకు వీలుగా టిటిఈ డోర్ సమీపంలోని సీటును ఉపయోగించుకున్నట్లు కూడా వివరణ ఇచ్చింది.
అయితే కమిషన్ రికార్డులో ఉన్న ఫొటోలు, ఇతర ఆధారాలను పరిశీలించి, ఫిర్యాదుదారుడికి కేటాయించిన సీటుపై టిటిఈ సూట్కేసు గొలుసుతో తాళం వేసి ఉంచినట్లు గుర్తించింది. దీంతో రైల్వే వాదనలను తిరస్కరించిన కమిషన్, ప్రయాణికుడు డబ్బు చెల్లించి రిజర్వ్ చేసుకున్న సీటును టిటిఈ వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం స్పష్టమైన సేవా లోపమని తేల్చిచెప్పింది. ప్రయాణికుల హక్కులు, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత రైల్వే సిబ్బందిపై ఉందని కమిషన్ తన తీర్పులో స్పష్టం చేసింది.
