
DNews: Dec 06: ఖైరతాబాద్లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా డిసేబుల్డ్ రైట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్ రోడ్పై అవగాహన నడక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం సలహాదారు వెన్నరెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడుతూ వికలాంగులకు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి సంబంధించి జేవీవోలను సక్రమంగా అమలు చేయాలని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని, అలాగే వారి పెన్షన్ను రూ.6,000కి పెంచాలని ఆయన కోరారు. “వికలాంగులు శారీరకంగా వికలాంగులైనా, మానసికంగా అందరికంటే ఉన్నతులు. వారు పది మందికి ఉపయోగపడాలని ఆలోచించే వారు” అని సీఎం సలహాదారు వెన్నరెడ్డి అన్నారు. దివ్యాంగుల సంఘం సలహాదారు పద్మారెడ్డి మాట్లాడుతూ గతంతో పోలిస్తే వికలాంగుల పట్ల సమాజంలో దృక్పథం ఎంతో మారిందని, ఆర్టీసీ బస్ పాస్లను అందించడంలో ముందడుగు వేయాలని సూచించారు. రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, ఆల్ ఇండియా దివ్యాంగుల హక్కుల ఫోరమ్ జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
