
DNews: Dec 08: హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో సోమవారం ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యాల దిశగా ముందుకు సాగుతోందని, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే క్రమంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమేనని ఆయన స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, మహిళా రైతులను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బస్సుల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా మహిళలకు అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు. తెలంగాణలో స్థిరమైన, పారదర్శకమైన ప్రభుత్వం ఉందని గవర్నర్ వర్మ వివరించారు.
నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతోందని, 20 లక్షల మంది రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని చెప్పారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని గుర్తుచేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని, ఇది సంస్కృతి, కళలు, సాంకేతికత, పరిశ్రమల కేంద్రంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. శాంతి, ఐక్యత వాతావరణంలోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ గ్లోబల్ సమ్మిట్ మంగళవారం ముగియనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 44 దేశాల నుండి వచ్చిన 154 మంది ప్రతినిధులు, అతిథులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరైనందున భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
