
DNews : Dec 02: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో జరగనుంది. ఈ సమ్మిట్కు దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, అతిథులు హాజరుకానున్నారు. రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఒక్క తప్పు కూడా జరగకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పార్కింగ్, లాజిస్టిక్స్, అతిథి సత్కారం, శుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. డిసెంబర్ 5లోపు అన్ని పనులు పూర్తి చేసి, 6న డ్రై రన్ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష కూడా నిర్వహించారు. సమ్మిట్కు వచ్చే ప్రతినిధులు ఎటువంటి అసౌకర్యం ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రతా పరంగా కూడా డీజీపీ శివధర్ రెడ్డి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రతిష్టాత్మకంగా నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది.
