
DNews: Nov 17: హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్, ఒక ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన సీనియర్ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీ అరేబియాకు పంపాలని కేబినెట్ నిర్ణయించింది. మృతుల అంత్యక్రియలు అక్కడే వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకుంది. మృతుల కుటుంబాల నుంచి ఇద్దరు సభ్యులను సౌదీ అరేబియాకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించింది.
సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదరాబాద్కు చెందినవారని తెలంగాణ హజ్ కమిటీ వెల్లడించింది. మృతుల్లో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా నవంబర్ 9న హైదరాబాద్లోని నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ విద్యానగర్కు చెందిన నజీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది సభ్యులు మృతి చెందారు.
