
DNews: Nov 21: మార్చి నెల తెలంగాణ మెట్రో రైలు ప్రాజెక్టుకు కీలకంగా మారనుంది. ఎల్ & టీ నిర్వహిస్తున్న మొదటి దశ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి చర్యలు ప్రారంభించగా, మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశ విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2(A)లో 5 మార్గాలు, 2(B)లో 3 మార్గాలను ప్రతిపాదించింది. ఈ విస్తరణను కేంద్రం–రాష్ట్రం సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఎల్ & టీతో జరిగిన చర్చల్లో, సంస్థ ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమని తెలిపిన తర్వాత ఇంతకాలం కొనసాగిన అడ్డంకి తొలగిపోయింది. ఈ నేపథ్యంలో స్వాధీనం ప్రక్రియను మార్చి చివరి నాటికి పూర్తి చేయడానికి చర్యలు వేగవంతం అయ్యాయి. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 8 మార్గాల విస్తరణపై సాధ్యత పరిశీలించి, అనుమతులపై నిర్ణయం మార్చి నెలలో తీసుకుంటామని తెలిపారు. అందువల్ల మొదటి దశ స్వాధీనం ప్రక్రియను కూడా అదే సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది.
