
DNews: Dec 12: హైదరాబాద్లో ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫుట్బాల్ మ్యాచ్లో ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు లియోనెల్ మెస్సీ పాల్గొననున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి లోపాలు లేకుండా కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మ్యాచ్కు హాజరుకానున్నందున, భద్రతా వ్యవస్థలు మరింత కట్టుదిట్టంగా ఉండాలని సూచించారు. ప్రేక్షకులు పాటించాల్సిన నియమాలను మెట్రో రైళ్లలో, ప్రధాన కూడళ్లలో బోర్డుల ద్వారా తెలియజేయాలని, ట్రాఫిక్ మళ్లింపుల వివరాలను ముందుగానే ప్రకటించాలని ఆయన సూచించారు. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉప్పల్ స్టేడియాన్ని భద్రతా కారణాల రీత్యా నాలుగు విభాగాలుగా విభజించి, 39,000 మంది సామర్థ్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీజీలు మహేశ్ భగవత్, స్వాతి లక్ష, చరుసింహ, విజయ్ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్మన్, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్, మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, జీహెచ్ఎంసీ విద్యుత్ మరియు నీటి శాఖ అధికారులు పాల్గొన్నారు.
