
D Spiritual: Aug 03: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన ‘రంగం’ (భవిష్యవాణి) సోమవారం ఉదయం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చి మట్టి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత (శివసత్తి) అమ్మవారిని ఆవాహన చేసుకుని రాబోయే పరిణామాలపై భవిష్యవాణి వినిపించారు. తాను క్రోధంతో వచ్చానని, రాబోయే రోజుల్లో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
భవిష్యవాణిలో ఈ ఏడాది రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టం సంభవించే పరిస్థితులు ఏర్పడవచ్చని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు, అనుకోని ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే తాను సంతోషంగా రాలేదని, తీవ్ర ఆగ్రహంతో వచ్చానని మాతంగి స్వర్ణలత తెలిపారు. గతంలో సూచించిన విగ్రహ ప్రతిష్ఠ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆలయంలో నిలిచిపోయిన ఆ పనులను వచ్చే ఆరు నెలల్లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని హెచ్చరించారు. లేకపోతే తీవ్రమైన ప్రాణనష్టం, విపత్తులు సంభవించే అవకాశముందని పేర్కొన్నారు.
ప్రజలు నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు శాంతి హోమాలు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని పూజారులు, ఆలయ అధికారులకు సూచించారు. రంగం కార్యక్రమం ముగిసిన అనంతరం అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఘనంగా ఊరేగించగా, లష్కర్ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.
