
D News: Jul 31: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (52) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
వైద్యుల వివరాల ప్రకారం, పెద్ది సుదర్శన్ రెడ్డి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబోలిజం) కారణంగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్)కు గురయ్యారు. వెంటనే అత్యవసర చికిత్స అందించి దాదాపు ఐదు రోజుల పాటు వెంటిలేటర్పై ఉంచి వైద్యులు శ్రమించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డితో కలిసి పనిచేసిన రోజులను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.
ఉద్యమకారుడిగా, ప్రజా నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని కల్వకుంట్ల కవిత కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని యశోద ఆస్పత్రి నుంచి నర్సంపేటకు తరలించారు. తన అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు.
