
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పదేళ్ల పాలనలో పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు నీటి పంపిణీపై మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో నీటి కొరత పరిస్థితులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తూ ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ఆయకట్టులకు తాగునీరు, సాగునీటిని నిరంతరం అందిస్తోందని తెలిపారు.
అయితే రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం ప్రచారం కోసమే ముఖ్యమంత్రి సొంత జిల్లాకు నీటిని విడుదల చేయడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ఆర్భాటంగా ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందని జూపల్లి గుర్తుచేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపిందని, దాదాపు 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేకపోయిందని ఆరోపించారు.
కల్వకుర్తి ప్రాజెక్టు కింద 25 టీఎంసీల నీటిని అందించే పనులను ఎందుకు పూర్తి చేయలేదో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం చెప్పాలని జూపల్లి డిమాండ్ చేశారు. రైతులకు నీరు అందించకుండా ఉంటే పంటల కొనుగోలు, బోనస్ చెల్లింపుల బాధ్యత నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన వైఫల్యాలను ప్రజలు గమనించే ఆ పార్టీని అధికారానికి దూరం చేశారని మంత్రి ఎద్దేవా చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా వంద శాతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
కృష్ణా జలాలను పాలమూరు జిల్లా రైతులకు పూర్తిస్థాయిలో అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
