
మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ‘ఇరుముడి’ చిత్రబృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 12న ట్రైలర్ను గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న భారీ ఈవెంట్లో ట్రైలర్ను ఆవిష్కరించనున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కుటుంబం కోసం ఓ వ్యక్తి ఎంతటి సాహసానికైనా సిద్ధపడే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. “When family means everything, a man will do anything for them” అనే క్యాప్షన్తో మేకర్స్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు.
జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. సాయికుమార్, బేబీ సన్నిత, యిప్ప శర్మ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించడంతో రవితేజ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఆగస్టు 12న భీమవరంలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్లో ‘ఇరుముడి’ ట్రైలర్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
