
DNews: Nov 25: సిద్ధిపేట: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండుగ సందర్భంగా 18 ఏళ్లు పూర్తిచేసుకున్న 1.30 కోట్ల మహిళలకు చీరలు అందజేశారని తెలిపారు. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల్లో కేవలం 40 లక్షల మందికే చీరలు ఇచ్చిందని ఆయన విమర్శించారు. మంగళవారం సిద్ధిపేట నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సిద్ధిపేట జిల్లాలో 3 లక్షల 83 వేల మహిళలు ఉన్నప్పటికీ, కేవలం 1 లక్ష 99 వేల మందికే చీరలు అందుతున్నాయని పేర్కొన్నారు.
మహిళల కోసం మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన రూ.60 వేల నగదు బదులు చీరలు ఇచ్చారని, పట్టణ ప్రాంతాల్లో చీరలు ఇవ్వలేదని, వడ్డీ రహిత రుణాలు కూడా అందించడం లేదని ఆయన విమర్శించారు. మహిళా సంఘాలు రూ.25 వేల కోట్ల రుణాలు తీసుకుంటే, వాటిలో కేవలం రూ.5 వేల కోట్లకే వడ్డీ రహిత రుణాలు ఇస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం 20 పైసలు ఇస్తూ 80 పైసలు తీసుకుంటోందని ఆరోపించారు. మొత్తం మొత్తానికి వడ్డీ రహిత రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే మహిళా నిధికి కూడా వడ్డీ రహిత రుణాలు ఇవ్వాలని కోరారు. జిల్లాలోని మహిళా సంఘాలకు ఒక్క RTC బస్సు కూడా ఇవ్వలేదని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఒక్క మెగావాట్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ పండుగలకు సంక్షేమ పథకాలు అందిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం ఓట్ల కోసం పథకాలు ఇస్తున్నారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
