
D Educt: Aug 18: ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల్లో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందేనని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) స్పష్టం చేసింది. ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకత పాటించాలని, అర్హులైన విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేలా పర్యవేక్షణ ఉండాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలిని ఆదేశించింది.
2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి హైదరాబాద్ దూలపల్లిలోని సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కళాశాల, శంషాబాద్లోని వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ యాజమాన్యాలు కేటగిరీ-బి సీట్ల భర్తీలో నిబంధనలు పాటించలేదంటూ 2021లో ఓయూ ఐకాస నేత పాలడుగు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆగస్టు 17న కీలక ఆదేశాలు జారీ చేశారు.
నిర్ణీత ఫీజుతో మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సి ఉండగా, సెయింట్ మార్టిన్స్, వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలు ఆన్లైన్ పోర్టల్, ఫోన్ నంబర్లు పనిచేయడం లేదనే కారణంతో అర్హులైన విద్యార్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించలేదని ఫిర్యాదుదారు కమిషన్కు ఆధారాలను సమర్పించారు.
ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్హెచ్ఆర్సీ.. విద్యార్థులను దరఖాస్తు చేసుకోకుండా అడ్డుకోవడం విద్యాహక్కు చట్టం-2009తో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లోని జీవించే హక్కుకు విరుద్ధమని అభిప్రాయపడింది.
ఇకపై ఏ విద్యా సంవత్సరంలోనూ కేటగిరీ-బి అడ్మిషన్ల ప్రక్రియలో యాజమాన్యాలు అనధికారికంగా, ఏకపక్షంగా విధానాలను అమలు చేయకుండా నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఎస్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ప్రవేశాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేసింది.
