
D News: Jul 20: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలోని పేదలకు గృహాలు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు, అర్హతలు, విధివిధానాలతో కూడిన ప్రత్యేక బ్రోచర్ను సోమవారం సచివాలయంలో విడుదల చేయనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ఈ బ్రోచర్ను ఆవిష్కరించనున్నారు.
ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాల్లో నివసించే అర్హులైన పేదలకు తొలి విడతలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా నగరంలోని నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటోంది.
తొలి దశలో హైదరాబాద్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మించనున్నారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను అధికారులు గుర్తించి సేకరించారు. ఈ ప్రాజెక్టుల్లో గరిష్టంగా 10 అంతస్తుల వరకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించనున్నారు. భవిష్యత్తులో నగరంలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఎల్బీనగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, మేడ్చల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నాంపల్లి, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేటాయించారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్న ప్రభుత్వ భూముల్లో బహుళ అంతస్తుల గృహ సముదాయాలను నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా పరిగణించి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అర్హులైన లబ్ధిదారులు తమ సొంత నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 3.68 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, వాటిలో రెండు లక్షలకు పైగా ఇళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదనంగా హైదరాబాద్లో ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున కేటాయించడంతో పాటు, నగరంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
