
D News: Aug 8: ఉద్యోగులకు ఊరట.. PF విత్డ్రా నిబంధనల్లో కీలక మార్పులు
భారత ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కోట్లాది మంది చందాదారులకు ప్రయోజనం కలిగించేలా పీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. పీఎఫ్ డబ్బుల ఉపసంహరణ (PF Withdrawal), నెలవారీ కాంట్రిబ్యూషన్, ఉద్యోగం మారినప్పుడు లేదా వదిలేసినప్పుడు నిధులు తీసుకునే విధానాలను మరింత సరళీకరించింది. జూన్ 29 నుంచి పాత ‘1952 పీఎఫ్ పథకం’ స్థానంలో కొత్త ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2026’ అమల్లోకి వచ్చినట్లు సమాచారం.
విత్డ్రా కేటగిరీలు కుదింపు
కొత్త EPF నిబంధనల్లో ప్రధాన మార్పుల్లో ఒకటి పీఎఫ్ అడ్వాన్స్ విత్డ్రా కేటగిరీలను తగ్గించడం. గతంలో ఉద్యోగంలో ఉన్న సమయంలో పీఎఫ్ అడ్వాన్స్ తీసుకునేందుకు 13 రకాల కేటగిరీలు ఉండగా, కొత్త విధానంలో వాటిని కేవలం మూడు ప్రధాన కేటగిరీలుగా కుదించారు. దీంతో పీఎఫ్ అడ్వాన్స్కు సంబంధించిన ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
ఆరోగ్య అవసరాలకు 100 శాతం వరకు విత్డ్రా
కొత్త నిబంధనల ప్రకారం మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య అవసరాల కోసం పీఎఫ్ ఖాతాలోని అర్హత ఉన్న మొత్తంలో 100 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ సదుపాయాన్ని పొందాలంటే ఉద్యోగి కనీసం 12 నెలల పాటు పీఎఫ్ సభ్యుడిగా ఉండాలి.
విద్య, వివాహం, ఇంటి అవసరాలకు ప్రత్యేక పరిమితులు
విద్య కోసం ఉద్యోగులు జీవితకాలంలో కనీసం 10 సార్లు పాక్షికంగా పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. వివాహ అవసరాల కోసం జీవితకాలంలో గరిష్టంగా 5 సార్లు విత్డ్రా చేసుకోవచ్చు.
అదేవిధంగా ఇల్లు కొనుగోలు, ఇంటి నిర్మాణం, హోమ్ లోన్ లేదా ఇంటి పునరుద్ధరణ వంటి అవసరాల కోసం జీవితకాలంలో గరిష్టంగా 5 సార్లు పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. ఈ కేటగిరీకి 12 నెలల సభ్యత్వం లేదా సర్వీస్ నిబంధన వర్తిస్తుంది.
వాలంటరీ కాంట్రిబ్యూషన్ పెంచుకునే అవకాశం
రూ.15,000 కంటే ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులు తమ నెలవారీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ను స్వచ్ఛందంగా పెంచుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఉన్న 12 శాతం లేదా రూ.1,800 కంటే ఎక్కువ మొత్తాన్ని ఉద్యోగి తన ఇష్టానుసారం అదనంగా చెల్లించవచ్చు. ఉద్యోగి పెంచిన కాంట్రిబ్యూషన్కు అనుగుణంగా యాజమాన్యం కూడా తన వాటాను అందించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి ఉద్యోగి ఈ అదనపు కాంట్రిబ్యూషన్ను ఎప్పుడైనా తగ్గించుకోవచ్చు లేదా నిలిపివేయవచ్చు.
ఉద్యోగం వదిలిన వెంటనే పూర్తి PF మొత్తం డ్రా చేయలేరు
కొత్త నిబంధనల్లో ఉద్యోగం వదిలిన తర్వాత పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకునే విషయంలోనూ మార్పు చేశారు. ఉద్యోగం మానేసిన వెంటనే ఖాతాలోని మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ను విత్డ్రా చేసుకునే అవకాశం ఉండదు. ప్రారంభంగా మొత్తం బ్యాలెన్స్లో 75 శాతం వరకు మాత్రమే ఉపసంహరించుకోవచ్చు.
మిగిలిన 25 శాతంతో పాటు పూర్తి పీఎఫ్ మొత్తాన్ని ఉద్యోగం వదిలిన 12 నెలల తర్వాత మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఈ మార్పుల ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని పీఎఫ్ నిధులను కొంతకాలం కొనసాగించేలా కొత్త విధానం రూపొందించినట్లు తెలుస్తోంది.
