
DNews: Nov 22: హైదరాబాద్లో జరిగిన ఫార్ములా–E కార్ రేస్ కేసుకు సంబంధించి ACB అధికారులు తుది నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో ముఖ్యాంశాలను ప్రస్తావించారు. ఇందులో A1 మాజీ మంత్రి కేటీఆర్, A2 ఐఏఎస్ అధికారి అర్వింద్, A3 బీఎల్ఎన్ రెడ్డి, A4, A5 FEO ప్రతినిధులు పేర్లు ఉన్నాయి. కేటీఆర్ స్వయంగా ఈ రేస్ నిర్వహణ నిర్ణయం తీసుకున్నారని నివేదికలో స్పష్టంచేశారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా రేస్ నిర్వహించడం వల్ల దానికి తగ్గట్టుగా జరిగిందని పేర్కొన్నారు. ఈ రేస్కు సంబంధించి BRS పార్టీకి రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందాయని, అవి త్రిపాక్షిక ఒప్పందానికి ముందే చెల్లించబడ్డాయని నివేదికలో ఉంది.
ఐఏఎస్ అధికారి అర్వింద్ రెండు ఒప్పందాలను గవర్నర్ సంతకం లేకుండా చేసారని, MAUD నుండి అనుమతులు పొందలేదని, ముఖ్యమంత్రి, CS, ఆర్థిక మంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వలేదని నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ చెల్లింపులు, ఒప్పందాలు చేసినట్లు స్పష్టంచేశారు. త్రిపాక్షిక ఒప్పందంలో లేకపోయినా సీజన్–9 కోసం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు ACB అధికారులు నివేదికలో తెలిపారు.
HMDA త్రిపాక్షిక ఒప్పందంలో లేకపోయినా FEOకి రూ.46 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని, BLN రెడ్డి బిల్లును ఆమోదించారని నివేదికలో ఉంది. సీజన్–10 కోసం HMDA నుండి రూ.54.88 కోట్లు చెల్లించారని, RBI నియమావళి ఉల్లంఘన కారణంగా అదనంగా రూ.8 కోట్ల భారాన్ని HMDAపై మోపారని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 30న చేసిన రెండో ఒప్పందం వల్ల సీజన్–10, 11, 12లకు ప్రభుత్వం రూ.600 కోట్ల భారాన్ని భరించాల్సి వస్తుందని నివేదికలో వివరించారు. HMDA లేకపోతే ఈ బాధ్యత Ace NXT Genపై పడేదని కూడా నివేదికలో స్పష్టంచేశారు.
ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై దర్యాప్తు జరపడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత ACB అధికారులు ఈ కేసులో దూకుడును పెంచారు.
