
D Educt: Aug 17: ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల (జూడోలు) ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. తమ దీర్ఘకాలిక డిమాండ్ అయిన స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాకపోవడంతో నేటి నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది.
ఇప్పటివరకు రోగులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో జూడోలు సాధారణ వైద్య సేవలు, ఓపీడీ సేవలు, విధులకు మాత్రమే దూరంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసర సేవలను కూడా నిలిపివేయాల్సి వచ్చిందని జూనియర్ డాక్టర్లు తెలిపారు.
ఐసీయూ, క్యాజువాలిటీ, అత్యవసర ఆపరేషన్లతో పాటు అన్ని రకాల ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తున్నట్లు వారు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
రోగులకు తప్పని తిప్పలు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వైద్యారోగ్య శాఖ దృష్టి
జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలను కూడా బంద్ చేయడంతో ప్రభుత్వ బోధనాస్పత్రులకు వచ్చే పేద రోగుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. సమ్మె ప్రభావం రోగులపై పడకుండా వైద్యారోగ్య శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది.
అత్యవసర విధుల్లో సీనియర్ వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లను నియమించాలని అధికారులు ఆదేశించారు. అవసరమైతే ఇతర విభాగాల నుంచి వైద్యులను డిప్యుటేషన్పై రప్పించాలని సూచించారు.
అయితే ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరంతరం సేవలందించే జూనియర్ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని జూనియర్ డాక్టర్ల సమస్యను పరిష్కరించి, సమ్మెను విరమింపజేయాలని ప్రజలు కోరుతున్నారు.
