
D News: Jul 31: భారతీయ నావికుడు అదృశ్యం: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన 22 ఏళ్ల మర్చంట్ నేవీ నావికుడు రామ్ చంద్ర దూబే ఉక్రెయిన్లోని ఒడెసా ఓడరేవు సమీపంలో అదృశ్యమయ్యారు. తాను విధులు నిర్వహిస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగిన తర్వాత గత ఆరు రోజులుగా ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అధికారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం దొరకలేదు.
ప్రయాగ్రాజ్లోని ఝున్సీ ప్రాంతానికి చెందిన నిబి కాలా గ్రామానికి చెందిన రామ్ చంద్ర దూబే రిటైర్డ్ సైనికోద్యోగి రమేష్ చంద్ర దూబే చిన్న కుమారుడు. ఇటీవలే మర్చంట్ నేవీలో చేరిన ఆయన, గత ఏడాది సెప్టెంబరులో విధుల కోసం విదేశాలకు వెళ్లారు. ఇది ఆయన రెండో విదేశీ ప్రయాణం కాగా, ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, జూలై 24 రాత్రి రామ్ చంద్ర తన తల్లి కల్పనా దూబేతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడారు. తమ నౌక ఉక్రెయిన్ నుంచి బయలుదేరిందని ఆమెకు తెలిపారు. అయితే 24 గంటలు గడవకముందే ఒడెసా సమీపంలో నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం అందింది.
షిప్పింగ్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఆ వాణిజ్య నౌకలో నలుగురు భారతీయులతో పాటు మొత్తం ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. డ్రోన్ దాడి సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు భారతీయ నావికులు సముద్రంలోకి దూకారు. అనంతరం ఉక్రెయిన్ రక్షణ బృందాలు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు భారతీయులను సురక్షితంగా రక్షించాయి. అయితే రామ్ చంద్ర దూబేతో పాటు మరో భారతీయ నావికుడి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.
రామ్ చంద్ర సోదరి సీమాక్షి, ఆమె భర్త అనుజ్ కుమార్ పాండే తొలుత స్థానికంగా సమాచారం సేకరించేందుకు ప్రయత్నించారు. అనంతరం ఆయన పెద్ద సోదరుడు కృష్ణ దాస్ దూబే ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జూలై 27న ఢిల్లీకి వెళ్లి షిప్పింగ్ సంస్థ అధికారులను కలిశారు. అదృశ్యమైన నావికులను గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని సంస్థ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లభించలేదు.
ఆశను వదులుకోని కుటుంబ సభ్యులు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. ఉక్రెయిన్ అధికారులు, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసి అదృశ్యమైన భారతీయ నావికుల ఆచూకీని గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
