
D News: Jul 28: దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబంలో విషాదం
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద వార్తను పూరీ కుమార్తె పవిత్ర జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్టుతో అభిమానులకు తెలియజేశారు.
తన నానమ్మతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పవిత్ర జగన్నాథ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ ఫొటోను పంచుకున్నారు. ఆ పోస్టులో, “ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెడతారు? నీతో మరో రోజు గడిపే అవకాశం వస్తే ఎంత బాగుండేది. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లే మరోసారి పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ” అంటూ తన మనసులోని బాధను వ్యక్తం చేశారు.
పవిత్ర చేసిన ఈ భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆమెకు, పూరీ జగన్నాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా, పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం సినీ వర్గాలను తీవ్రంగా కలచివేసింది. పలువురు నటీనటులు, దర్శకులు, అభిమానులు పూరీ జగన్నాథ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
