
DNational 12 Mar: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ (LPG) కొరత ఏర్పడవచ్చనే ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
గృహ వినియోగానికే మొగ్గు: మార్చి 8న జారీ చేసిన ‘LPG కంట్రోల్ ఆర్డర్’ ప్రకారం.. రిఫైనరీలు వంటగ్యాస్ ఉత్పత్తిని పెంచాలని, వచ్చిన స్టాక్ను మొదట గృహ వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
వాణిజ్య అవసరాలపై ఆంక్షలు: హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థలకు గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించారు. అయితే, ఆసుపత్రులు మరియు విద్యాసంస్థలకు ఈ ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చారు.
భద్రత పెంపు: గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లు, రవాణా వాహనాలు మరియు పంపిణీ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర పోలీస్ బాస్ (DGP)లను కేంద్రం ఆదేశించింది.
నల్లబజారుపై ఉక్కుపాదం: గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు (Hoarding) మరియు నల్లబజారుకు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను మరియు పాత వీడియోలను నమ్మి ప్రజలు భయాందోళన చెందవద్దని కేంద్రం కోరింది. గ్యాస్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించేందుకు హోం మంత్రిత్వ శాఖలో 24×7 కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. పెట్రోలియం, సమాచార ప్రసార శాఖల అధికారులు ఇందులో సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.
ప్రస్తుతానికి గృహ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎవరూ అనవసరంగా స్టాక్ చేసుకోవాల్సిన పనిలేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
